ప్రవళిక ఆత్మహత్య పైసిట్టింగ్ . జడ్జితోవిచారణ*జరిపించాలి – GMPS

రాంనగర్ హనుమకొండ నిన్న రాత్రి హైదరాబాద్ అశోక్నగర్లో ఆత్మహత్య చేసుకొని మరణించిన మర్రి ప్రవళిక మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆమె మృతిపై సమగ్ర విచారణ జరుపాలని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం (GMPS) హనుమకొండ జిల్లా కమిటి డిమాండ్ చేస్తుంది.

ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి కాడబోయిన లింగయ్య జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల రమేష్ తో కలిసి ప్రకటన విడుదల చేశారు. ప్రవళిక మృతికి సంతాపం తెలిపారు. ఆ కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన మర్రి లింగయ్య యాదవ్ వ్యవసాయం చేసుకుంటూ కష్టపడి ప్రవళికను చదివించాడు. ప్రవళిక గ్రూప్-2) పోటీ పరీక్షల కోసం నెలల తరబడి ఫీజులు కడుతూ, అనేక ఇబ్బందుల మధ్య హైదరాబాద్లోని అశోక్ నగర్ హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అవుతోంది. గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా పడటంతో ప్రవళిక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్యహత్యకి సంబంధించి సూసైడ్ నోటు లభించినప్పటికీ అందులో ప్రవళిక ఆత్మహత్యకు గల కారణాలపై స్పష్టత లేదు. మరోవైపు గ్రూప్-2 పరీక్ష వాయిదా పడటం వల్ల కాదని, ప్రవళిక ప్రేమ వ్యహారం కారణంగానే ఆత్మహత్య చేసుకుందనే వార్తలు పోలీసుల నుండి వస్తున్నాయి. ప్రవళిక మృతిపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని చిక్కడపల్లి ఏసీపీ హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల వెనుక ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొని, విషయాన్ని పక్కదారి పట్టించేందుకేనా అనే అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా ప్రేమ వ్యవహారమే ఐతే పోలీసులు సంయమనం ఎందుకు కోల్పోతున్నారు. పోలీసుల హెచ్చరికలు దేనికోసం? సరైన ఆధారాలతో సమాధానాలు చెబుతూ సమన్వయం చేసి సమస్యను పరిష్కరించాల్సిన పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం ఏమిటి? మరోవైపు ప్రవళిక స్వంత ఊరిలో కనీసం బంధువులను కడసారి చూపులు కూడా చూడనివ్వకుండా హడావిడి చేసి పోలీస్ బందోబస్తు మధ్య అంత్యక్రియలు చేయడం ఎందుకు? ఆ గ్రామంలోకి ఎవరికి అనుమతి లేదంటూ ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదు. కన్నబిడ్డను పోగొట్టుకున్న తల్లితండ్రులను కనీసం కంటినిండా ఏడ్వనివ్వకుండా చేయడం కెసిఆర్ ప్రభుత్వానికే చెల్లుతుంది.

రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు సంవత్సరాల తరబడి కష్టపడి చదువుకుంటుంటే ప్రభుత్వం మాత్రం వారి జీవితాలతో ఆటలాడుకుంటుంది. స్వరాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం కాదు కాదా కనీసం పరీక్షల నిర్వహణ కూడా చేతగాని ప్రభుత్వం ఇదని తేలిపోయింది. ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని, పోరాడి గెలువాలి తప్ప ఆత్మహత్యలు చేసుకొని సమాజానికి తప్పుడు సంకేతాలు ఇవ్వవద్దని విద్యార్థి యువతను కోరుతున్నాము.

ప్రభుత్వం వెంటనే స్పందించి విషయాన్ని పక్కదారి పట్టించకుండా 👉ప్రవళిక మృతిపట్ల సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలి. అప్పటి వరకు పోలీసుల ప్రచారం కూడా ఆపాలి. 👉ప్రవళిక కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. 👉అలాగే 20 లక్షల ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలి. లేకుంటే ఎన్నికల్లో ప్రజలు, నిరుద్యోగులు, గొల్లకురుమలు బుద్ధి చెబుతారని హెచ్చరిస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *