తెలుగు గళం హన్మకొండ సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి,మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు.తెలంగాణ వీరనారి,సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్బంగా హన్మకొండ హంటర్ రోడ్డులోని చాకలి ఐలమ్మ విగ్రహానికి శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్,ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు,హన్మకొండ,వరంగల్ జిల్లాల కలెక్టర్ ప్రావీణ్య సత్య శారదా దేవితో కలిసి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ…భూమి కోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు.తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజాస్వామిక పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ఐలమ్మ సేవలను,ఆమె ధైర్యసాహసాలను గుర్తుచేశారు.మహిళా చైతన్యానికి,సాధికారతకువెనుకబడిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని అభివర్ణించారు.ఆనాడు నిరంకుశ నిజాం రజాకార్లను,దేశ్ ముఖులకు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మనందరికి ఆదర్శమనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.