
telugu galam news e69news local news daily news today news
అటవీ అభివృద్ధి పేరుతో వ్యాపారం చేస్తున్న వారిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు ఈ భూముల వ్యవహారంపై నోరు విప్పాలి తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ ఎఫ్ డీ సీ ) ని రద్దు చేసి ఆ భూములను పేదలకు పంచాలని కోరుతూ సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఆదివాసీ జీవన విధానం ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త మరియు జర్నలిస్టు పి. క్రాంతి మాట్లాడారు. కొందరు తమకున్న పలుకుబడిని ఆసరా చేసుకొని చట్టాలను తమకు అనుకూలంగా మలుచుకొని ఏజెన్సీ ప్రాంతంలోని అటవీ భూములను 1976 నుంచి అత్యంత కారుచౌకగా లీజుకు తీసుకొంటున్నారని ఆరోపించారు. కేవలం ఎకరం రూ. 8 చొప్పున అటవీ శాఖ కు చెల్లిస్తూ అటవి అభివృద్ధి పేరిట వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. అశ్వారావుపే మండల పరిధిలో సుమారు 4949 ఎకరాల భూములను గత 48 సంవత్సరాలుగా ఫారెస్టు డెవలప్ మెంట్ కార్పోరేషన్ అనుభవిస్తుందన్నారు. ఈ భూముల్లో అటవీ అభివృద్ధి ఏమాత్రమూ జరగక పోగా ఆ భూముల్లో జమాయిల్, వెదురు వంటి వాణిజ్య పంటలను సాగుచేస్తూ భూసారాన్ని మొత్తం పీల్చిపిప్పి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా షెడ్యూల్ ప్రాంతాల్లో ఉంటూ 1/70, పెసా చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. వీరి ఇన్నేళ్ళ వ్యాపారంలో ఏనాడూ ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి చూపింది లేదు. కనీసం విద్య, వైద్యం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయకుండా ఈ ప్రాంత వనరులు దోపిడీ చేస్తున్నారని అన్నారు. నిజానికి వీరు వ్యాపారంలో 10 శాతం ఈ ప్రాంతాల కోసం ఖర్చు చేసినా కోట్ల రూపాయల అభివృద్ధి జరిగి ఉండేదన్నారు. వీరి మూలంగా జీవ వైవిద్యం పూర్తిగా దెబ్బదింటున్నది. వన్య ప్రాణులు, పక్షులు నిలువ నీడలేక ప్రాణాలు కోల్పోతున్నాయి. భూమిలో ఉండే సహజ క్రిమికీటకాలు నశిస్తున్నాయి. దీని పర్యవసానం పర్యావరణ సమతూల్యత దెబ్బదిని ప్రకృతి వైపరిత్యాలు ఏర్పడుతున్నాయి. వీరి లాభాలకోసం వారు సాగుచేసే పంటలకు ఎరువులు పురుగు మందుల వాడకం కూడా చేస్తూ బంగారం లాంటి అటవీ భూములను సర్వనాశనం చేస్తున్నారు. ఇది సమాజానికి ఏమాత్రమూ మంచిది కాదన్నారు. ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు ఈ భూముల వ్యవహారంపై నోరువిప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో సాగుతున్న ఈ కార్పోరేటు వ్యాపారాన్ని తక్షణం నిలుపుచేసేలా చర్యలు తీసుకోవాలి కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు సోయం బాబూరావు చిన్నారి), తాటి రవి, సోడె స్వరాజ్, సున్నం నాగరాజు పాల్గొన్నారు.