
సన్న బియ్యం పంపిణీ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన మంత్రి ఉత్తమ్
ఈ69న్యూస్ జనగామ
రేషన్ దుకాణాలకు సన్న బియ్యం రవాణా,పంపిణీని వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.శుక్రవారం,హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యం సరఫరాపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ నేపథ్యంలో జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)పింకేష్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఈ దృశ్య మాధ్యమ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కిలో బియ్యానికి రూ.40కి పైగా వెచ్చించి ప్రజలకు ఉచితంగా సరఫరా చేశామని,చాలా పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసి ప్రజలకు బియ్యం సరఫరా చేస్తున్నప్పటికీ 70 నుంచి 80 శాతం వరకు ఆ బియ్యాన్ని ప్రజలు తినేవారు కాదని,రీసైక్లింగ్ ద్వారా కోళ్ల ఫారాలకు,ఇతర అవసరాలకు తరలి వెళ్లేదని మంత్రి పేర్కొన్నారు.రాష్ట్రంలో అత్యధిక జనాభా దొడ్డు బియ్యం తినడం ఆపేశారని,దీన్ని గమనించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని 84 శాతం జనాభాకు ఉచితంగా సరఫరా చేసే కార్యక్రమం చేపట్టామన్నారు.సన్న బియ్యం సరఫరా పంపిణీ విజయవంతం అవుతుందని,84 శాతం జనాభా ఆహార భద్రతకు సుస్థిరత ఏర్పడిందన్నారు.రేషన్ దుకాణాలకు సన్న బియ్యం సరఫరా రవాణాను వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.రవాణా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి,సన్న బియ్యం రవాణాపై కలెక్టర్ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.ఈ నెల 6న శ్రీరామ నవమి సందర్భంగా సీఎం భద్రాచలం రానున్నారని,సన్న బియ్యం స్వీకరించిన దళిత గిరిజన కుటుంబాలతో కలిసి భోజనం చేస్తారని మంత్రి వెల్లడించారు.జిల్లా స్థాయిలో కూడా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఎంపీలు,ప్రజాప్రతినిధులు,కలెక్టర్లు,ఇతర ఉన్నతాధికారులు పేదలతో కలిసి ప్రభుత్వం సరఫరా చేస్తోన్న సన్న బియ్యంతో భోజనం చేయాలని మంత్రి సూచించారు.13 వేల కోట్లు ఖర్చు చేసి,30 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని ఆహార భద్రత కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని,ఈ మేరకు ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా చూడాలన్నారు.అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ..సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా ప్రారంభించామని,దీనికి కృషి చేసిన అధికారులకు,సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.సన్న బియ్యం పంపిణీ కారణంగా రేషన్ దుకాణాల వద్ద ఒకేసారి డిమాండ్ పెరిగిపోతున్నందున బియ్యం రవాణాను వేగవంతం చేయాలని,రేషన్ దుకాణాల వద్ద అవసరమైన మేర బియ్యం అందుబాటులో ఉండాలని సూచించారు. సంచుల కొరత ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని,సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.సన్న బియ్యం పంపిణీపై ప్రభుత్వ చిత్తశుద్ధి చాటేలా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.నూతన ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు.ఈ వీడియో సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులతో సమీక్షించి,దిశానిర్దేశం చేశారు.జిల్లాలో మొత్తం (335) రేషన్ దుకాణాలు ఉన్నాయని,మొత్తం (1,61,264) ఆహార భద్రత కార్డులు ఉండగా(4,95,294) మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు. వీరందరికీ మొత్తం (3,151) మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సన్న బియ్యం రవాణాను,నూతన ఆహార భద్రత కార్డుల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీసీఎస్ఓ సరస్వతి,డీఎం సీఎస్ హతీరామ్,తదితరులు పాల్గొన్నారు.