దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు
వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజక వర్గం, వర్ధన్నపేట మండల కేంద్రంలో విలేఖర్లతో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ..పత్తి రైతు సోదరులకు 2025- 26 సంవత్సరమునకు గాను ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ. 8110 /- లుగా నిర్ణయించనైనది.రైతు సోదరులు తమ పత్తి సరుకును ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ వారికి అమ్ముటకు గాను జిన్నింగ్ మిల్లుకు తీసుకు వచ్చే ముందే వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పత్తి పంట వేసినట్లు నమోదు తప్పని సరిగా చేసుకోవలెను. తర్వాత సీసీఐ వారి కిసాన్ యాప్ నందు రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని రాగలరు.స్లాట్ బుక్ చేసుకొని వచ్చిన వారి కాటన్ మాత్రమే సీసీఐ వారు కొనుగోలు చేయడం జరుగుతుంది.అలాగే పత్తిని బాగా అరబెట్టి తేమ శాతం 12 % లోపు ఉండే విధంగా చెత్త చెదారం లేకుండా శుభ్రం చేసుకుని తీసుకురాగలరు. ఇలా తీసుకువొచ్చిన వారికి సరైన మద్దతు ధర లభిస్తుంది. పత్తి తేమ శాతం 8 నుండి 12 % లోపు ఉండవలెను. 8 శాతం కన్నా ఎక్కువగా ఉంటే ఒక్కో శాతం పెరిగే కొద్దీ క్వింటాలుకు రూ. 81 రూపాయలు తగ్గును. 12 శాతం కన్నా ఎక్కువగా ఉన్న పత్తిని సీసీఐ వారు కొనుగోలు చెయ్యరు. తదుపరి జిన్నింగ్ మిల్లుకు వచ్చేటపుడు రైతు వెంట ఆధార్ కార్డ్ జీరాక్స్ , పట్టాదారు పాస్ బుక్ జీరాక్స్ మరియు ఆధార్ కార్డుకు లింక్ అయిన సెల్ నంబర్ వెంట తెచ్చుకోగలరు. ఆధారుతో అనుసందానం అయిన బ్యాంకు నందు మాత్రమే మీ యొక్క పత్తి అమ్మిన డబ్బులు జమచేయబడును కావున రైతులు గమనించగలరు. రైతుల సౌకర్యార్థం పత్తి కొనుగోళ్ల సంబంధిత సేవలకై ఫోన్ నెంబర్ 18005995779 మరియు వాట్సప్ చాట్ సేవలకై 8897281111 లను వినియోగించుకోగలరని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాము. రైతులు తాము ఆరు కాలం కష్టపడి పండించిన పత్తిని మధ్యధళారులకు అమ్ముకొని మోసపోకుండా సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద మాత్రమే అమ్ముకొని మద్దతు ధర పొందగలరని తెలిపారు.