ఐడీఓసీలో ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు
ఆర్థిక అభివృద్ధి, మెరుగైన ఆరోగ్యం, నాణ్యమైన విద్య, సమానత్వం బాధ్యతయుతమైన జీవన విధానం కేవలం చిన్న కుటుంబంతోనే సాధ్యమవుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ స్పష్టం చేశారు.శనివారం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ భవనంలో గల డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని, 2026 సంవత్సరానికి గాను “యువత ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడం: నేడు మరియు భవిష్యత్తు కోసం” అనే ప్రధాన థీమ్తో ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు వెల్లడించారు. తెలంగాణలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ, ఆరోగ్య సంరక్షణ, సుస్థిర అభివృద్ధిపై విస్తృత ప్రచారం జరుగుతోందని, అందులో భాగంగా జిల్లావ్యాప్తంగా జూలై 11 నుంచి 18 వరకు వారం రోజుల పాటు జనాభా నియంత్రణ, మాతా శిశు సంరక్షణ అంశాలపై అవగాహన సదస్సులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రకటించారు.ఈ సందర్భంగా మాతా శిశు సంరక్షణ ప్రాధాన్యతను వివరిస్తూ, బిడ్డకు బిడ్డకు మధ్య కనీసం మూడు సంవత్సరాల కాలం ఎడం ఉండాలని, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న వివిధ రకాల కుటుంబ నియంత్రణ పద్ధతులను గ్రామీణ స్థాయి వరకు ప్రజలు అలవర్చుకునేలా చూడాలన్నారు. దీనివల్ల తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉంటారని, సమాజానికి హానికరమైన బాల్య వివాహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించరాదని పిలుపునిచ్చారు. జిల్లాలోని విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో జనాభా నియంత్రణ,వనరుల సద్వినియోగంపై ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో రానున్న జూలై 13వ తేదీన జిల్లావ్యాప్తంగా నిర్వహించబోయే జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని కూడా వైద్య సిబ్బంది, ఇతర శాఖల సమన్వయంతో అత్యంత పగడ్బందీగా, విజయవంతంగా పూర్తి చేయాలని డీఎంహెచ్ఓ అధికారులను, క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు.అనంతరం జిల్లాలో కుటుంబ నియంత్రణ వైద్య సేవల్లో, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు వైద్యులను,సిబ్బందిని, ఆదర్శ మహిళలను డీఎంహెచ్ఓ డాక్టర్ మధుసూదన్ శాలువాలు కప్పి,మెమొంటోలతో ఘనంగా సన్మానించారు.ఉత్తమ సేవలందించిన వారిలో బెస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్జన్గా నిలిచిన జీజీహెచ్ డాక్టర్ దివ్య,గైనకాలజిస్ట్ డాక్టర్ కేజీయ,భూపాలపల్లికి చెందిన డాక్టర్ రోహిణి,మొగుళ్లపల్లి ఏఎన్ఎం శ్రీలత, పొట్లపల్లి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త రాజశ్రీలు సన్మానం పొందిన వారిలో ఉన్నారు.వీరితో పాటు కేవలం ఒకే బిడ్డను కలిగి ఉండి, బాధ్యతాయుతంగా ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకుని సమాజానికి ఆదర్శంగా నిలిచిన భూపాలపల్లి రాజీవ్ కాలనీకి చెందిన మధుమిత (భర్త సంతోష్)ను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు.ఈ బృహత్తర అవగాహన కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ శ్రీదేవి, సందీప్, డెమో కె. శ్రీదేవి, ఏఎంఓ సుధాకర్తో పాటు జిల్లాలోని హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు,ఆశా కార్యకర్తలు,కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.