కొడంగల్ కు తరలి వెళ్లిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన “చలో కొడంగల్” కార్యక్రమానికి జనగామ జిల్లా నాయకులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.జనగామ నుంచి ప్రారంభమైన వాహన ర్యాలీని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజనీకాంత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లలో ఉద్యమకారులను పూర్తిగా విస్మరించారని, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉద్యమకారుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈగం శ్రీనివాస్ మాట్లాడుతూ, కమిటీ ఏర్పాటు స్వాగతించదగ్గ నిర్ణయమే అయినప్పటికీ, అది కాలయాపనగా మారకుండా వెంటనే ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు, పెన్షన్లు, ఇంటి స్థలాలు, ఇతర సంక్షేమ పథకాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది ఉద్యమకారులు కుటుంబాలను, ఉపాధిని పక్కనపెట్టి పోరాడారని, పోలీసుల లాఠీచార్జీలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.జీవించి ఉన్నప్పుడే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని, మరణించిన ఉద్యమకారుల కుటుంబాలను కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షుడు తిప్పారపు ఆనంద్, నియోజకవర్గ ఇన్చార్జ్ కడింగుల బాలకృష్ణ, జనగామ పట్టణ అధ్యక్షురాలు గంగాభవాని, మండల అధ్యక్షుడు బొల్లం భాస్కర్, గంగారాం, లింగం తదితరులు పాల్గొన్నారు.