ప్రణాళిక రహిత నిర్మాణాలే హైదరాబాద్ వరద ముంపుకు ప్రధాన కారణం- డా. దొంతి నరసింహారెడ్డి
నగరంలో ప్రణాళిక రహిత నిర్మాణాలు, మున్సిపల్ చట్టాలకు విరుద్ధంగా భవనాలకు అనుమతులు ఇవ్వడమే ప్రతి వర్షాకాలంలో వరద ముంపు సమస్యలకు ప్రధాన కారణమని అర్బన్ పాలసీ నిపుణులు డా. దొంతి నరసింహారెడ్డి అన్నారు. “హైదరాబాదులో వరద నీటి కష్టాలు–ప్రభుత్వ సన్నద్ధత” అంశంపై హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం అర్బన్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు.వర్షపు నీటి సహజ ప్రవాహ మార్గాలను ఆక్రమించడం, మెట్రో రైలు పిల్లర్ల మధ్య నిర్మాణాలు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల రోడ్లు, ఫ్లైఓవర్లు కాల్వల్లా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో శాశ్వత చర్యలు చేపట్టకపోవడం, వాటర్ షెడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడం పరిస్థితిని మరింత దిగజార్చిందన్నారు.వర్షాకాల సమస్యలపై అధికారులు, ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ, నగర సమస్యలపై పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాలతో చర్చించకపోవడం విచారకరమన్నారు.వీరందరితో ప్రభుత్వం తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు.పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సర్వత్ మాట్లాడుతూ, సహజ నీటి ప్రవాహ మార్గాలను అడ్డుకోవడం వల్లే బంజారాహిల్స్ ప్రాంతంలోని వరద నీరు ఇప్పుడు రోడ్లు, ఇళ్లలోకి చేరుతోందని విమర్శించారు. చెరువుల సుందరీకరణతో పాటు వాటి విస్తీర్ణం, లోతు పరిరక్షణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రతి డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ నిర్మాణంలో తప్పనిసరిగా ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేయాలని సూచించారు.యూడీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాలకు చెట్లు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగిపోవడం, స్టీల్ బ్రిడ్జిపై కూడా నీరు నిలవడం హైదరాబాద్ మౌలిక వసతుల లోపాలను బయటపెట్టిందన్నారు. గత వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఇప్పటికీ నష్టపరిహారం అందకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ట్రాఫిక్కు ఆటంకంగా ఉన్న రోడ్డు పక్కన ఉన్న ప్రార్థనా స్థలాలను పరస్పర అంగీకారంతో సమీప ప్రాంతాలకు తరలించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.ఈ కార్యక్రమానికి హెచ్సీఎఫ్ ప్రధాన కార్యదర్శి కె. వీరయ్య అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షుడు మల్లం రమేష్ వేదికపై ఆహ్వానించారు. ఎం. శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు.హెచ్సీఎఫ్ నగర నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పర్యావరణ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.