ఐడీఓసీలో ప్రజల నుండి 65 వినతుల స్వీకరణ
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
ఐడీఓసీలో ప్రజల నుండి 65 వినతుల స్వీకరణ
పారదర్శకత కోసం ప్రతి దరఖాస్తును పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశం
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన ప్రతి దరఖాస్తును అధికారులు బాధ్యతగా తీసుకుని,నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని,జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు.ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం 65 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు సమయపాలనతో సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.అందిన ప్రతి విన్నపాన్ని అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి,వెంటనే సంబంధిత శాఖలకు ఎండార్స్మెంట్ చేయాలని సూచించారు.ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకత ఉండాలని,ఇందుకోసం ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి,దరఖాస్తుదారునికి రశీదు అందజేయాలని స్పష్టం చేశారు.వినతులపై అధికారులు తీసుకున్న చర్యల వివరాలను కూడా క్రమం తప్పకుండా పోర్టల్లో అప్డేట్ చేయాలని ఆదేశించారు.సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించినా లేదా అనవసరంగా జాప్యం చేసినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్,విజయలక్ష్మి,డీఆర్వో వసంత కుమారి,అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.