రైతాంగ హక్కుల కోసం మహాసభలను విజయవంతం చేయాలి
రైతాంగ సమస్యల పరిష్కారం, భవిష్యత్ పోరాటాల కార్యాచరణ లక్ష్యంగా ఈనెల 11, 12, 13 తేదీల్లో ఇల్లందులో జరగనున్న అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) జాతీయ ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని డివిజన్ అధ్యక్షుడు ఒగ్గు నాగిరెడ్డి రైతులకు పిలుపునిచ్చారు.
స్థానిక నీలం రామచంద్ర భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. రైతాంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి నెట్టేందుకు తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను దేశవ్యాప్త రైతాంగ పోరాటంతో వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అయినప్పటికీ అదే విధానాలను మరో రూపంలో అమలు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారని, అప్పుల భారంతో ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ సమస్యలపై సమగ్ర చర్చ జరిపి భవిష్యత్ ఉద్యమాలకు దిశానిర్దేశం చేయడానికే జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మహాసభలకు ముందు ఈనెల 11న వేలాది మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. సభకు ఏఐయుకేఎస్ ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ కన్వీనర్ కేచ్చేల రంగారెడ్డి అధ్యక్షత వహించనున్నారని తెలిపారు. ఏఐయుకేఎస్ జాతీయ నాయకుడు ప్రదీప్ సింగ్ ఠాగూర్ ప్రారంభోపన్యాసం చేయనున్నారని చెప్పారు.
సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి రంగారావు, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు కె.రామ, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.రాము, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, జిల్లా కార్యదర్శి ముద్దా బిక్షం, జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము తదితరులు సభలో పాల్గొని ప్రసంగించనున్నారని తెలిపారు.
మహాసభలు, బహిరంగ సభలను రైతులు, ప్రజలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో డివిజన్ కార్యదర్శి బీరెల్లి లాజరు, కే.వెంకటేశ్వర్లు, ఎన్.మంగయ్య, తాటిరాజు తదితరులు పాల్గొన్నారు.