నూతన న్యాయమూర్తి జె.జీవన్ కుమార్కు ఘన స్వాగతం
మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ ప్లీడర్ బొట్లా సుధాకర్,బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కునూరు సురేష్ కుమార్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు నూతన న్యాయమూర్తి (డిస్ట్రిక్ట్ జడ్జి)గా బాధ్యతలు స్వీకరించిన జె. జీవన్ కుమార్ ని మంగళవారం జిల్లా కోర్టు నూతన భవన సముదాయంలో స్థానిక న్యాయవాదులు,బార్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.జిల్లాకు నూతనంగా విచ్చేసిన న్యాయమూర్తికి వారు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా జిల్లా కోర్టు గవర్నమెంట్ ప్లీడర్ బొట్లా సుధాకర్,బార్ అసోసియేషన్ అధ్యక్షులు కునూరు సురేష్ కుమార్ ల ఆధ్వర్యంలో న్యాయవాదుల ప్రతినిధి బృందం న్యాయమూర్తి జీవన్ కుమార్ గారిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసింది.అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, జిల్లా న్యాయవాద లోకం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
బాధితులకు వేగంగా న్యాయం జరిగేలా కృషి
ఈ భేటీ సందర్భంగా ప్రభుత్వ ప్లీడర్ బొట్లా సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కునూరు సురేష్ కుమార్లు నూతన న్యాయమూర్తితో పలు కీలక విషయాలపై చర్చించారు.జిల్లాలో కోర్టు కేసుల పురోగతిని, సామాన్య ప్రజలకు న్యాయసేవలు అందే తీరును న్యాయమూర్తికి వివరించారు.కోర్టును ఆశ్రయించే పేద, మధ్యతరగతి బాధితులకు వేగంగా, సత్వర న్యాయం జరిగేలా చూసేందుకు, జిల్లాలో న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు బార్ అసోసియేషన్, ప్రభుత్వ న్యాయవాదుల విభాగం తరఫున పూర్తిస్థాయి సహకారాన్ని అందిస్తామని వారు ఈ సందర్భంగా జడ్జి గారికి స్పష్టం చేశారు. నూతన న్యాయమూర్తి జీవన్ కుమార్ స్పందిస్తూ.. కోర్టు కార్యకలాపాల నిర్వహణలో, పెండింగ్ కేసుల పరిష్కారంలో న్యాయవాదుల పాత్ర కీలకమని, అందరి సహకారంతో జిల్లా న్యాయవ్యవస్థ ప్రతిష్టను మరింత పెంచుదామని ఆకాంక్షించారు.ఈ మర్యాదపూర్వక సమావేశంలో సీనియర్ అడ్వకేట్ ఎండీ రఫీ,ప్రముఖ న్యాయవాదులు దుప్పటి ప్రవీణ్, కె. చిరంజీవిలతో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు పరిపాలనా సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.