భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్పీ అభ్యర్థి నామినేషన్
29వ వార్డు నుంచి మామిడి శ్రీకాంత్ నామినేషన్ దాఖలు
•పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి – జిల్లా అధ్యక్షుడు రవి పటేల్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంగా జరుగుతున్న భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) తన పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. ఈ క్రమంలో భూపాలపల్లి మున్సిపాలిటీ 29వ వార్డు నుంచి టీఆర్పీ అభ్యర్థిగా మామిడి శ్రీకాంత్ నామినేషన్ను ఈరోజు అధికారికంగా దాఖలు చేశారు.ఈ నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ముఖ్య అతిథిగా హాజరై, నామినేషన్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తల నినాదాల మధ్య అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో టీఆర్పీ తరఫున రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇంకా పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులు ఎవరైనా ఉంటే, వెంటనే జిల్లా పార్టీ నాయకత్వాన్ని సంప్రదించాలని సూచించారు.భూపాలపల్లి పట్టణ అభివృద్ధి జరగాలంటే, మున్సిపాలిటీలో నెలకొన్న అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలంటే అది కేవలం తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యమని రవి పటేల్ స్పష్టం చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ప్రకటించిన మేనిఫెస్టోలో అవినీతి రహిత మున్సిపాలిటీలు, ప్రజలకు నిజాయితీగా సేవ చేసే పారదర్శక పాలన అందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.గత పాలకుల హయాంలో జరిగిన అవినీతిని ఇకపై కొనసాగనివ్వకుండా నిలువరించాలంటే, టీఆర్పీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ, మౌలిక వసతులు వంటి అనేక సమస్యల పరిష్కారానికి టీఆర్పీ ఎల్లవేళలా ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని భరోసా ఇచ్చారు.రేపటితో నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో, పోటీ చేయదలచిన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే పార్టీ నాయకత్వాన్ని సంప్రదించాలని జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎస్.పీ.కే. సాగర్, భూపాలపల్లి మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, సాయికుమార్, శ్రావణ్ కుమార్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు