అక్రిడిటేషన్–2026 వెబ్సైట్ ప్రారంభించిన మంత్రి పొంగులేటి
ఆధునీకరించిన సమాచార & పౌరసంబంధాల శాఖ వెబ్సైట్తో పాటు అక్రిడిటేషన్–2026 పోర్టల్ను రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం సచివాలయంలో తన కార్యాలయంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పును రెండేళ్లలోనే చూపించి వారి విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి ముఖ్యంగా ఆర్థిక రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ సంక్షోభం నుంచి బయటపడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని వేగవంతం చేస్తున్నామని అన్నారు.ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పుకు నాంది పలుకుతోందని చెప్పారు. వ్యవసాయం, విద్య, వైద్యం, గృహనిర్మాణం, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఉపాధి కల్పన వంటి రంగాల్లో చేపట్టిన సంస్కరణలు తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలుపుతున్నాయని పేర్కొన్నారు.ఈ మార్పులను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో సమాచార శాఖ పాత్ర అత్యంత కీలకమని, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిందని, తక్కువ కాలంలోనే విశేష విజయాలు సాధించిందన్నారు. ఆరు హామీల అమలు, అదనపు సంక్షేమ పథకాలు, వ్యవసాయ–పారిశ్రామిక అభివృద్ధి ద్వారా తెలంగాణ ఆర్థిక వృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు.“తెలంగాణ రైజింగ్–2047” దృష్టి పథంతో రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రపంచ నగరాలతో పోటీ పడే అభివృద్ధి లక్ష్యాలు, పేదల సంక్షేమం అనే ద్విముఖ వ్యూహంతో పాలన కొనసాగుతోందని, పారదర్శకత–ఆధునికత–సంక్షేమంతో తెలంగాణను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దామని చెప్పారు.ఈ కార్యక్రమంలో సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ సిహెచ్. ప్రియాంక, ముఖ్యమంత్రి ప్రజాసంబంధాల అధికారి జి. మల్సూర్, అదనపు సంచాలకుడు డీఎస్ జగన్, సంయుక్త సంచాలకుడు రమణ తదితరులు పాల్గొన్నారు.