ఆటో డ్రైవర్ల సమస్యలపై ఎమ్మెల్యేకు సిఐటియు వినతి
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు జూబ్లీహిల్స్ జోన్ కమిటీ గౌరవ ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు వినతి పత్రం సమర్పించింది.నియోజకవర్గంలో వేలాది మంది ప్యాసింజర్ ఆటో డ్రైవర్లు ఆటోలను నడుపుతూ తమ కుటుంబాలను పోషిస్తున్నప్పటికీ, ఇటీవల ఉచిత బస్సు సౌకర్యం అమలు మరియు రాపిడో వంటి ప్రైవేట్ సేవలు విస్తరించడంతో ఆటోలకు గిరాకీ తగ్గిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంధన ధరలు ఎన్నోసార్లు పెరిగినా గత 12 సంవత్సరాలుగా ఆటో మీటర్ రేట్లు పెంచలేదని, పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా వెంటనే మీటర్ రేట్లు సవరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ₹12,000 నష్టపరిహారం అందిస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు.అలాగే ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులకు గృహాల మంజూరు, బీమా, పెన్షన్ వంటి సామాజిక భద్రతా పథకాలు కల్పించాలని, వారి పిల్లల చదువుకు ప్రత్యేక స్కాలర్షిప్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించి తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జూబ్లీహిల్స్ జోన్ కమిటీ నాయకులు రాపర్తి అశోక్, ఎండి. అసిఫ్, మొయిన్, అబ్దుల్ బాబా, అశోక్ చౌదరి, మహబూబ్ బాబా తదితరులు పాల్గొన్నారు.