ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సమగ్ర పరిశీలన
ఈ నెల 8న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.ముఖ్యమంత్రి కొడవటంచ ఆలయాన్ని సందర్శించి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్న నేపథ్యంలో, అక్కడ కొనసాగుతున్న నిర్మాణ పనులు, హెలిప్యాడ్, రహదారి సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు.మొదటగా కొడవటంచ ఆలయ పరిసర ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించిన ఎస్పీ,పనులు వేగంగా,నాణ్యతతో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారులు, ఉప రహదారులపై మరమ్మతులు, శుభ్రత, సూచిక బోర్డుల ఏర్పాటు, తాత్కాలిక అవరోధాల తొలగింపుపై స్పష్టమైన సూచనలు చేశారు. ముఖ్యమంత్రి వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా ప్రయాణం జరిగేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు.అదేవిధంగా ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను పరిశీలించిన ఎస్పీ,భద్రతా వలయాల ఏర్పాటు,బారికేడింగ్, అత్యవసర సేవల ఏర్పాట్లు, అగ్నిమాపక వాహనాల సన్నద్ధతపై అధికారులతో చర్చించారు.హెలికాప్టర్ ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో ప్రజలు, మీడియా, వాహనాలు నిర్దేశిత దూరంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అనంతరం భూపాలపల్లి పట్టణంలోని మంజూరు నగర్లో ఏర్పాటు చేయనున్న సభా ప్రాంగణాన్ని సందర్శించి స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సభా వేదిక, ప్రజల కూర్చునే ఏర్పాట్లు, వీఐపీ గ్యాలరీ, మీడియా గ్యాలరీ, అత్యవసర వైద్య సేవల కేంద్రం, తాగునీటి సౌకర్యాలు, మరుగుదొడ్ల ఏర్పాటు వంటి అంశాలపై సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు.వాహనాల పార్కింగ్ ప్రాంతాలను కూడా పరిశీలించిన ఎస్పీ, వీఐపీ వాహనాలు, ప్రజా వాహనాలు, మీడియా వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ జోన్లు కేటాయించాలని, ట్రాఫిక్ను మళ్లించే మార్గాలను ముందుగానే ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.ట్రాఫిక్ సిబ్బంది, వాలంటీర్లు, సివిల్ డిఫెన్స్ బృందాలను మోహరించి ప్రజల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పోలీసు శాఖతో పాటు రెవెన్యూ, మున్సిపాలిటీ, వైద్య, విద్యుత్, అగ్నిమాపక, రవాణా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి విభాగానికి బాధ్యతలు స్పష్టంగా కేటాయించి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు.ప్రజల భద్రత, సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని,ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా జిల్లా యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని ఆయన తెలిపారు.ఈ పరిశీలన కార్యక్రమంలో ఎన్ ఎస్ ఆర్ సంస్థలో అధినేత నాయినేని సంపత్ రావు,పోలీసు అధికారులు డీఎస్పీ సంపత్ రావు,గణపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ కరుణాకర్ రావు,చిట్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మల్లేష్,గణపురం ఎస్సై రేఖ అశోక్, రేగొండ ఎస్సైలు రాజేష్,సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి,రెవెన్యూ అధికారులు,మున్సిపల్ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.