శ్రీ మహాలక్ష్మి స్వరూప శ్రీ శ్రీ సత్తెమ్మ అమ్మవారి 10వ వార్షిక మహోత్సవాలు
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల బీరాపల్లి గ్రామ సరిహద్దులో గల గ్రామ దేవతగా భక్తుల ఆరాధన పొందుతున్న శ్రీ మహాలక్ష్మి స్వరూప శ్రీ శ్రీ సత్తెమ్మ అమ్మవారి 10వ వార్షిక మహోత్సవాలు మంగళవారం అత్యంత భక్తి, శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగాయి.ఫాల్గుణ మాస పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ మహోత్సవాల్లో ఉదయం 8:30 గంటలకు అమ్మవారికి విశేష అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉదయం 10:00 గంటలకు భక్తులు సంప్రదాయ బోనాలతో అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం పరిసరాలు “జై సత్తెమ్మ తల్లి” నినాదాలతో మారుమోగాయి.
ఉదయం 11:00 గంటలకు నిర్వహించిన మహా అన్నదానం కార్యక్రమంలో సుమారు పది వేల మంది భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. మహిళలు, యువత, గ్రామ పెద్దలు, చిన్నారులు కుటుంబ సమేతంగా హాజరై అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందారు.
గణేషన్ పాడు,బీరాపల్లి, రామన్నపాలెం,కే.జీ. లమల్లెల, జయలక్ష్మిపురం, శంభునిగూడెం తదితర గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఉత్సవాలను విజయవంతం చేశారు. ఆలయం విద్యుద్దీపాలతో అలంకరించబడి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, “అమ్మవారి కృపాకటాక్షంతో గ్రామాల్లో ఐక్యత, ఐశ్వర్యం, సౌఖ్యం, ఆరోగ్యం, విజయాలు వెల్లివిరియాలని” ఆకాంక్షించారు. ప్రతి ఏడాది కంటే ఈసారి మరింత భారీగా భక్తుల స్పందన రావడం ఆనందదాయకమని తెలిపారు.శాంతి భద్రతల నడుమ, క్రమశిక్షణతో మహోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. భక్తుల విశ్వాసం, కమిటీ సభ్యుల కృషి, గ్రామ ప్రజల సహకారంతో ఈ వేడుకలు ఆధ్యాత్మికోత్సవంగా నిలిచాయి.