కాళేశ్వరం అంత్య పుష్కరాల ఏర్పాట్లు
కాళేశ్వరంలో నిర్వహించనున్న అంత్య పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో అంత్య పుష్కరాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, విద్యుత్, మిషన్ భగీరథ, వైద్య, ప్రణాళిక శాఖల అధికారులు పాల్గొన్నారు.సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కాళేశ్వరంలో నిర్వహించనున్న అంత్య పుష్కరాలకు సంబంధించిన శాశ్వత పనులను ఏప్రిల్ 30వ తేదీ లోపు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.అంత్య పుష్కరాల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేసి ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆయన సూచించారు.ఘాట్ల వద్ద పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సదుపాయాలు మరియు భక్తులు సురక్షితంగా స్నానం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు.పోలీస్ శాఖ ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.వైద్య శాఖ అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అంబులెన్స్లు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని తెలిపారు.అలాగే పనుల పురోగతిని సంబంధిత శాఖల అధికారులు తరచూ పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.అంత్య పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, దేవాదాయ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, విద్యుత్, మిషన్ భగీరథ, వైద్య, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.