వంట గ్యాస్ కొరత లేదు కలెక్టర్ రాహుల్ శర్మ
జిల్లాలో వంట గ్యాస్ సరఫరా సమృద్ధిగా కొనసాగుతోందని,ఎలాంటి కొరత లేదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు.గురువారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లాలో గ్యాస్ సరఫరా పరిస్థితులపై రెవెన్యూ, పోలీస్, పౌర సరఫరాల శాఖ, పౌర సరఫరాల సంస్థ అధికారులు,ఎల్పీజీ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహ వినియోగదారులకు వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా సాధారణంగా మరియు నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు.ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గ్యాస్ సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉందని పేర్కొన్నారు. గ్యాస్ ఏజెన్సీలు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ వినియోగదారులకు సమయానికి గ్యాస్ సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.జిల్లాలో ఎక్కడైనా గ్యాస్ సరఫరాలో అంతరాయం లేదా అక్రమాలు జరిగితే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారుల హక్కులను పరిరక్షిస్తూ పారదర్శకంగా సేవలు అందించడం ప్రతి గ్యాస్ ఏజెన్సీ బాధ్యత అని కలెక్టర్ స్పష్టం చేశారు.ప్రజలు గ్యాస్ కొరతపై వస్తున్న అపోహలను నమ్మవద్దని, జిల్లాలో గ్యాస్ నిల్వలు మరియు సరఫరా పూర్తిగా సమృద్ధిగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఏవైనా సమస్యలు, ఆలస్యం లేదా ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారులకు లేదా గ్యాస్ ఏజెన్సీలకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు.ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఏఎస్పీ నరేష్ కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ డీఎం రాములు, ఎల్పీజీ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు