ఏకకాలంలో ఇవ్వాలని ప్రదర్శన,ధర్నా
అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఏకకాలంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం నగరంలోని ధర్నా చౌక్ నుండి కలక్టరేట్ ప్రధాన ద్వారం వరకు ప్రదర్శన చేశారు.అనంతరం సుమారు రెండుగంటలపాటు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా నిర్వహించారు.జాయింట్ కలెక్టర్ శ్రీజ కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఇచ్చారు.ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుధా రాధ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మా విష్ణువర్ధన్ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 18 వేలు వేతనం ఇచ్చే జీఓ విడుదల చేయాలని, ఎన్.ఏ.పి.చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ లో తీర్మానాన్ని చేయాలని,2026 ఎడ్యుకేషన్ పాలసీ ను సవరించాలని,ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాలలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం పాల్గొన్న సీఐటీయూ జిల్లా కోశాధికారి చలమాల విఠల్ రావు,జిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్,అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నిoటి రమ్య, రాష్ట్ర నేత కోటేశ్వరి లు మాట్లాడుతూ మార్చి 16 నుండి ఒక్కపూట బడి నిర్వహించాలని,టీచర్స్ హెల్పర్స్ కు ఏకకాలంలో వేసవి సెలవులు ఇవ్వాలని,ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని,రిటైర్మెంట్ అయిన వారి సమస్యలు పరిష్కారం చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ నిర్వహించినా,పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని,ప్రజా పాలన అంటూ పోరాటాలను పోలీసులతో అరెస్టులు చేయించి అడ్డుకుంటుందని స్పష్టం చేశారు.అంతే కాకుండా మరో 19 రకాల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28 న ఖమ్మం జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలలో సామూహికంగా పనులు నిలిపివేయాలని,పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో: పాపారాణి,సుశీల,షకీనా,వాణీశ్రీ,పద్మ,నాగేంద్ర,రామేశ్వరీ,లలిత,రత్నకుమారి,విజయలక్ష్మి లతో పాటు మరో నాలుగొందలమంది టీచర్స్ పాల్గొన్నారు.