ప్రచారంలో ఇచ్చిన హామీకి కట్టుబడి
కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్లో డేగలమడుగు, లక్ష్మక్కపేట గ్రామాల్లో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారానికి కార్పొరేటర్ చింతలపూడి సాయి శ్రావణి ముందడుగు వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ గ్రామాల్లో పర్యటించిన సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, వారి అవసరాలను గుర్తించి డేగలమడుగు గ్రామంలో సురక్షిత మంచినీటి మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సాయి శ్రావణి, ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి సాయి కుమార్తో కలిసి పాల్గొన్నారు. స్వర్గీయ చింతలపూడి రామారావు పేరుతో ఈ ప్లాంట్ నిర్మించనున్నారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో భాగంగా తీసుకున్న ఈ చర్య ఆమెకు ఉన్న నమ్రత, విధేయతను ప్రతిబింబిస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, సీపీఎం మండల కార్యదర్శి వీర్ల రమేశ్, కాంగ్రెస్, సీపీఎం నాయకులు, డేగలమడుగు, లక్ష్మక్కపేట గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి, ఇచ్చిన హామీని అమలు దిశగా ముందుకు తీసుకువెళ్లిన కార్పొరేటర్ సాయి శ్రావణిని స్థానికులు అభినందించారు. ఈ ప్లాంట్ నిర్మాణంతో ఇరు గ్రామాల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి రానుందని, దీర్ఘకాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.