ప్రజావాణి దరఖాస్తులపై నిర్లక్ష్యం సహించం
భూపాలపల్లి జిల్లాలో ప్రజావాణి ద్వారా అందుతున్న దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులు స్పష్టంగా హెచ్చరించారు.సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి మొత్తం 80 దరఖాస్తులను స్వీకరించారు.ఈ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించే దిశగా సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్లు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ సంబంధిత శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు.కాటారం సబ్ కలెక్టర్ కార్యాలయం,డిపిఓ,డిఆర్డీఓ,పీఆర్ ఈఈ,మున్సిపాలిటీ,ఆర్డిఓ,విద్యుత్ శాఖ,ఎస్సీ అభివృద్ధి శాఖ,విద్యాశాఖ,సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలలో పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను వచ్చే వారం లోగా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.దరఖాస్తుల పరిష్కారంలో తగిన ప్రగతి కనిపించకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారని,వారి సమస్యలు ఆలస్యమైతే ప్రభుత్వ యంత్రాంగంపై నమ్మకం దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు.అందువల్ల ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్,విజయలక్ష్మి, ఆర్డిఓ హరికృష్ణతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.