ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
నర్సింగ్ వృత్తి సేవాభావానికి నిదర్శనం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
నర్సింగ్ విద్యార్థులు తమ వృత్తిలో మానవత్వం, సహనం, సేవా దృక్పథాన్ని అలవర్చుకుని ఆదర్శంగా నిలవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) పిలుపునిచ్చారు.భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్లో నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ అధ్యక్షతన నిర్వహించిన ‘లాంప్ లైటింగ్ & ఓత్ సెరిమనీ’ (జ్యోతి ప్రజ్వలన, ప్రమాణ స్వీకార ఉత్సవం) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో వైద్య సేవలు అందించే నర్సుల పాత్ర ఎంతో కీలకమని, రోగులకు నిస్వార్థంగా సేవ చేయడం దేవుడికి సేవ చేయడంతో సమానమని కొనియాడారు.నర్సింగ్ వృత్తి అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, అది అంకితభావంతో కూడిన పవిత్రమైన సేవా మార్గమని ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.లాంప్ లైటింగ్ కార్యక్రమం అనేది విద్యార్థుల జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టమని, ఇది అజ్ఞానమనే చీకటిని తొలగించి సేవా మార్గంలో వెలుగులు నింపే పవిత్ర సందర్భమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి,వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకుని ఉత్తమ నర్సులుగా ఎదగాలని ఆకాంక్షించారు.అనంతరం నర్సింగ్ వృత్తికి కట్టుబడి ఉంటామని విద్యార్థుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే సర్టిఫికెట్లను అందజేసి వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, ప్రజా ప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.