బంగారు గొలుసు దొంగతనం కేసును పోలీసులు
చాదర్ఘాట్లో జరిగిన సంచలన బంగారు గొలుసు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు
బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధుడి మెడలో నుంచి చైన్ కొట్టేసిన కేటుగాడిని అరెస్ట్ చేశారు.
ఈ నెల 23వ తేదీన, 61 ఏళ్ల గట్టు సీతారామారావు అనే వ్యక్తి లాలాజర్ ఎక్స్ రోడ్ బస్ స్టాప్లో 72J నంబర్ బస్సు ఎక్కారు. బస్సులో రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు ఆయన చుట్టూ చేరారు. ఈ గందరగోళంలో ఒక వ్యక్తి ఆయన మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసును లాకెట్తో సహా దొంగిలించి యశోద ఆసుపత్రి దగ్గర పరారయ్యాడు.
ఫిర్యాదు అందుకున్న చాదర్ఘాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వెంటనే రంగంలోకి దిగి నేరం జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితుడిని పాత నేరస్థుడైన మల్లేపల్లి మంగర్బస్తీకి చెందిన ఆటో డ్రైవర్ కమలే రతన్ అలియాస్ రతన్ బాదల్గా గుర్తించారు. ఇతను పేరుమోసిన పాత నేరస్థుడు.
విశ్వసనీయ సమాచారంతో ఈరోజు, అంటే 26వ తేదీన పోలీసులు మంగర్బస్తీలో రతన్ బాదల్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి దొంగిలించిన రెండున్నర తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ దొంగతనంలో తనతో పాటు ముగ్గురు స్నేహితులు ఉన్నట్టు నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు.అరెస్టయిన నిందితుడు కమలే రతన్ @ రతన్ బాదల్ వయస్సు 42 సంవత్సరాలు. అఫ్జల్ సాగర్, మల్లేపల్లిలో నివాసం ఉంటున్నాడు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులు సల్మాన్, ఇస్మాయిల్, ఇబ్రహీంల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బస్సుల్లో, రద్దీ ప్రదేశాల్లో ప్రయాణించేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.