
బీజేపీ మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ కేంద్ర మంత్రులపై విమర్శలు చేయడం కాదు
జఫర్గడ్, జూన్ 27 (ఈ69న్యూస్)
కేంద్ర మంత్రులను విమర్శించే ముందు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాలని జఫర్గడ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని బీజేపీ జఫర్గడ్ (వేల్పూగొండ) మండల అధ్యక్షుడు కోరుకొప్పుల నగేష్ గౌడ్ కోరారు.కేంద్ర మంత్రులు బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ, ప్రజా సమస్యలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందన్నారు.ఏడాది క్రితం తాను సోషల్ మీడియాలో ప్రస్తావించిన సమస్యల్లో ఇప్పటికీ చాలా వరకు పరిష్కారం కాలేదని, బ్రిడ్జిపై లైట్లు ఏర్పాటు చేయడం మినహా మిగతా అంశాల్లో పెద్దగా పురోగతి కనిపించలేదని పేర్కొన్నారు.మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే, సీటీ స్కాన్ వంటి వైద్య సదుపాయాలు లేకపోవడం, జఫర్గడ్ బస్టాండ్ నిర్మాణం పూర్తికాకపోవడం, హన్మకొండ జిల్లాలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీ అమలు కాకపోవడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు.అదేవిధంగా ఉప్పుగళ్ల గ్రామం వద్ద దెబ్బతిన్న రహదారులు, గ్రామంలో కోతుల బెడద, తిమ్మంపేట పరిసరాల్లో ప్రమాదకరంగా మారిన రోడ్లు, జడ్పీ పాఠశాలలో తగిన పారిశుద్ధ్య సదుపాయాల లేమి, అసంపూర్తిగా నిలిచిపోయిన గుట్ట రోడ్డు, వేల్పూగొండ గుట్ట వద్ద భద్రతా ఏర్పాట్ల కొరత, సాగరం–తిడుగు–గర్మిళ్లపల్లి మార్గం అధ్వాన్న పరిస్థితి, పీఎం విశ్వకర్మ పథకం లబ్ధిదారుల లాగిన్ల సమస్యలను కూడా ఆయన ప్రస్తావించారు.ఇవి కేవలం జఫర్గడ్ మండలంలోని కొన్ని సమస్యలు మాత్రమేనని, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని కోరుకొప్పుల నగేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.