ఐదు పెండింగ్ డీఏలు, పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించాలి
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బకాయి పడిన ఐదు విడతల డీఏలను వెంటనే విడుదల చేసి, పీఆర్సీ నివేదికను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కానుగంటి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.స్టేషన్ ఘన్పూర్ రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన జనగామ జిల్లా డిస్ట్రిక్ట్ ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు పెచ్చెట్టి చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రంజిత్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఉద్యోగులకు ఈ ప్రభుత్వ హయాంలో రావాల్సిన ఒక్క డీఏ కూడా విడుదల చేయలేదని విమర్శించారు.ప్రస్తుతం ఐదు విడతల డీఏలు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు.పీఆర్సీ అమలులో కూడా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని, జూలై 1తో మూడు సంవత్సరాల కాలయాపన పూర్తవుతున్నప్పటికీ నివేదికపై స్పష్టత ఇవ్వకపోవడం ఉద్యోగులను నిరాశకు గురిచేస్తోందన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనను నిర్లక్ష్యం చేస్తూ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను పక్కనపెట్టి కొత్త పాఠశాలల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి పెట్టడం సరైన విధానం కాదన్నారు.ఉమ్మడి సర్వీస్ నిబంధనల అమలు కూడా నిలిచిపోయిందని, రాష్ట్రవ్యాప్తంగా ఎంఈఓలు, డిప్యూటీ ఈఓలు, డీఈఓలు, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, డైట్, బీఎడ్ కళాశాలలు, జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది ఖాళీ పోస్టులు ఉన్నప్పటికీ భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు.విద్యార్థులకు యూనిఫామ్ల పంపిణీలో కూడా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆరోగ్య భద్రత కల్పించే ఈహెచ్ఎస్ను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.జూలై నెలలో జిల్లాలోని 12 మండలాల్లో సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయాలని సమావేశంలో తీర్మానించారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మడూరి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాశ్, జిల్లా కోశాధికారి చిక్కుడు శ్రీనివాస్, కుటుంబ సంక్షేమ నిధి జిల్లా కన్వీనర్ గూడెల్లి కృష్ణ, జిల్లా కార్యదర్శులు కందుల శ్రీనివాస్, శ్రీహరి, తోట వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, బాలకృష్ణ, దేవీసింగ్ తదితరులు పాల్గొన్నారు