విజయయ్యపల్లిలో వైభవంగా నవగ్రహ ప్రతిష్ఠాపన
కొత్తపల్లిగోరి మండల పరిధిలోని విజయయ్యపల్లి గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి సమేత ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఈ ఆధ్యాత్మిక వేడుకకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్సార్) ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ ప్రజలందరిపై ఆ దేవుడి ఆశీస్సులు, దేవతల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.విజయయ్యపల్లి గ్రామ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో,ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు.భక్తి మార్గం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని,గ్రామంలో శాంతి,సుఖసంతోషాలు విరాజిల్లాలని ఆయన కోరుకున్నారు.ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని,గ్రామంలో సోదరభావం వెల్లివిరియాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.ఈ పవిత్ర కార్యక్రమానికి తనను ఆహ్వానించి, సాదరంగా గౌరవించిన గ్రామ ప్రజలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.వేద పండితుల మంత్రోచ్చారణలు,భక్తుల జయజయధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట గ్రామ సర్పంచ్ జక్కుల మానస సాంబయ్య, ఉప సర్పంచ్ మేకల సాంబయ్య, గ్రామ పెద్దలు గొల్ల పెద్ద,జక్కుల రమేష్,వంగ మల్లేష్,మేకల గణేష్,జక్కుల సుధాకర్,స్థానిక నాయకులు,మహిళలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.