కరెంట్ షాక్కు గురై వృద్ధ రైతు మృతి
రేగొండ మండలంలోని ఆర్జీ తండాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మొక్కజొన్న పంటకు నీరు అందించే క్రమంలో విద్యుత్ షాక్కు గురైన వృద్ధ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఆర్జీ తండాకు చెందిన అజ్మీర రుప్లా నాయక్ (75) తన వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు మోటారు ఆన్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ షాక్కు గురయ్యాడు.ప్రమాద తీవ్రత కారణంగా ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్తులు తెలిపారు.సమాచారం అందుకున్న రేగొండ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ దుర్ఘటనతో మృతుని కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామంలో శోకసంద్ర వాతావరణం నెలకొనగా,పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆర్జీ తండా సర్పంచ్ రవళిక వీరునాయక్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.