ప్రతీ గ్రామానికి గోదావరి జలాలు
ప్రతీ ఎకరానికి రెండు పంటలు లక్ష్యం
దేవాదుల ఫేజ్-3,ప్యాకేజీ-6 పనులు 2027 జూన్ నాటికి పూర్తి చేస్తాం
-మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రతీ గ్రామానికి గోదావరి జలాలు అందించడం,ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు ఇవ్వడమే తన ఏకైక లక్ష్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.మనందరం కలిసి పనిచేస్తేనే ఈ లక్ష్యం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.జఫర్గడ్ మండలం సాగరం గ్రామ సమీపంలో చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు ఫేజ్-3,ప్యాకేజీ-6 పనులను నీటిపారుదల,రెవెన్యూ అధికారులు,రైతులు,ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కాలువల నిర్మాణ పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని,రైతుల సమస్యలను కూడా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ..2003-04లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో దేవాదుల ప్రాజెక్టును ప్రారంభించామని గుర్తుచేశారు.6 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు రూపొందించిన ఈ ప్రాజెక్టు,సవరించిన అంచనాలతో ప్రస్తుతం రూ.18,400 కోట్లకు చేరిందన్నారు.ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న జనగామ ప్రాంతం నేడు దేవాదుల ప్రాజెక్టుతో రాష్ట్రంలోనే అధిక వరి ఉత్పత్తి చేసే ప్రాంతంగా మారిందని తెలిపారు.దేవాదుల ఫేజ్-3,ప్యాకేజీ-6 పనులను 2027 జూన్ నాటికి పూర్తి చేయడానికి కృషి చేస్తానని,ఇందుకు రైతులు,స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం అవసరమని ఆయన అన్నారు.రైతులు సహకరిస్తేనే పనులు వేగంగా పూర్తి చేయడం సాధ్యమవుతుందని చెప్పారు.ఒక్క జఫర్గడ్ మండలంలోనే ఈ ప్యాకేజీ ద్వారా సుమారు 10 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నట్లు తెలిపారు.దంసా కాలువ,బంజరు మాటు,బొల్ల మత్తడి మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల అధికారులను ఆదేశించారు.అలాగే దంసా చెరువు,జఫర్గడ్ చెరువులను మరమ్మతు చేసి,నష్కల్ నుంచి పాలకుర్తి ప్రధాన కాలువకు ఓటీ ఏర్పాటు చేసి చెరువులను నింపి 365 రోజులు నీళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.రైతుల భూ సమస్యల పరిష్కారానికి త్వరలోనే జఫర్గడ్ మండల కేంద్రంలో రెవెన్యూ,నీటిపారుదల అధికారులు,రైతులు,ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.గ్రామాల వారీగా భూ సమస్యలపై నివేదికలు తయారు చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.కాలువల నిర్మాణానికి రైతులు సహకరించాలని,అధికారులు ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించి పనులు పూర్తి చేయాలని సూచించారు.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందించడమే తన లక్ష్యమని,ఆ లక్ష్యం నెరవేరాలంటే అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ సీఈ సుధీర్,ఎస్ఈ సీతారాం,ఈఈ మంగీలాల్,డీఈలు,ఏఈలు,తహసీల్దార్,ఇతర అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు,రైతులు పాల్గొన్నారు.