
గ్రౌండ్ లేకుండానే పాఠశాల నిర్వహణా..?
శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం పై తల్లిదండ్రులు ఆగ్రహం
ఈ69 న్యూస్ స్టేషన్ ఘన్పూర్ జూన్ 28
అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ తల్లిదండ్రులకు రసీదులు ఇవ్వడం లేదని,విద్యార్థులకు కనీస ఆటస్థలం (గ్రౌండ్) కూడా లేకుండానే పాఠశాల నిర్వహిస్తున్నారంటూ స్టేషన్ ఘనపూర్ శివుని పల్లిలోని శ్రీ చైతన్య పాఠశాలపై పలువురు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసినట్లు యువ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జానీ బాబా తెలిపారు.ఈ ఫిర్యాదుల నేపథ్యంలో షేక్ జానీ బాబా, ఎన్ఎస్యూఐ సోషల్ మీడియా నాయకుడు నీల మహేష్ తో పాటు ఇతర నాయకులు పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తూ, వాటికి రసీదులు ఇవ్వకపోవడం తీవ్ర ఆరోపణలకు తావిస్తోందన్నారు.విద్యార్థులకు ఆటస్థలం వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం కూడా ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ చేపట్టి, వాస్తవాలను నిర్ధారించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో షేక్ జానీ బాబా, నీల మహేష్తో పాటు పలువురు యువ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు పాల్గొన్నారు.