విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా
రేగొండ ఏఈ వంగ రాజు ఆధ్వర్యంలో అమలైన ప్రణాళిక
•విద్యుత్ శాఖ సిబ్బందిని అభినందించిన జాతర కమిటీ, భక్తులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతరలో విద్యుత్ సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించడం విద్యుత్ శాఖ సిబ్బంది విశేష కృషికి నిదర్శనంగా నిలిచింది.జాతర సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో, విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తుగా పటిష్ట చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.రేగొండ ఏఈ వంగ రాజు ఆధ్వర్యంలో లైన్మెన్ విజయ్,హెల్పర్లు శ్రావణ్, రంజిత్, లెల ప్రభాకర్,విద్యుత్ కాంట్రాక్టర్ ఖలీల్ పాషా బృందం జాతరకు సుమారు వారం రోజుల ముందుగానే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు.జాతర ప్రాంగణం, ఆలయ పరిసరాలు, రహదారులు, భక్తుల శిబిరాలు, తాత్కాలిక దుకాణాలు, భద్రతా ఏర్పాట్లు ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిరంతరం అందేలా ప్రత్యేక లైన్లు, అదనపు ట్రాన్స్ఫార్మర్లు, బ్యాకప్ ఏర్పాట్లు చేశారు. గత మూడు రోజులుగా పగలు–రాత్రి తేడా లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని జాతర కమిటీ పేర్కొంది.విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ,అంకితభావంతో విధులు నిర్వహించడంతో జాతర విజయవంతంగా కొనసాగుతుందని జాతర చైర్మన్,వైస్ చైర్మన్, కమిటీ సభ్యులు ప్రశంసించారు.ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు.పలువురు నాయకులు, భక్తులు కూడా వారి సేవలను కొనియాడారు.భక్తుల సౌకర్యమే లక్ష్యంగా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తే ఇలాంటి పెద్ద జాతరలు ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించవచ్చని ఈ సందర్భంగా పలువురు వ్యాఖ్యానించారు.