వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలి
వినియోగదారులు తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని,మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఇంచార్జి అదనపు కలెక్టర్ వై.వి.గణేష్ అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పౌర సరఫరాలు,తూనికలు-కొలతల శాఖలు చేపడుతున్న చర్యలపై ఆయా శాఖల అధికారులు వివరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ,మోసపూరిత తూకాల కారణంగా వినియోగదారులు ఎక్కువగా నష్టపోతున్నారని తెలిపారు.దీనిపై తూనికలు-కొలతల శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం తూకాల రాళ్లకు తప్పనిసరిగా స్టాంపింగ్ చేయాలని సూచించారు.వస్తువులు కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులు బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని,అవి మోసాలపై చట్టపరమైన చర్యలకు కీలక ఆధారాలుగా ఉంటాయని పేర్కొన్నారు.జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వినియోగదారుల హక్కులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,ప్రభుత్వ శాఖలతో పాటు వినియోగదారుల ఫోరమ్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు.జిల్లా వినియోగదారుల ఫోరం సూచనలను పరిగణనలోకి తీసుకొని వ్యవస్థను బలోపేతం చేసేందుకు జిల్లా వినియోగదారుల ఫోరమ్ పునరుద్ధరణ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.డిజిటల్ న్యాయ వ్యవస్థ ద్వారా వినియోగదారుల కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయనున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారి వాజిద్ అలీ,తూనికలు-కొలతల శాఖ అధికారి వెంకటేష్,రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు రతన్ సింగ్ ఠాగూర్,కార్యదర్శి సూరజ్,ఓరుగల్లు వినియోగదారుల ఫోరం సభ్యులు దండు యుగేందర్,బండ వివేకానంద,శోభ తదితరులు పాల్గొన్నారు.