
జనగామ జిల్లా, పాలకుర్తి మండలం – బమ్మెర గ్రామం:
సమాజంలో “వారసుడు అంటే కొడుకే” అనే పాత అభిప్రాయాలకు చెక్ పెట్టే ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన గుడికందుల సదానంద చారి అనారోగ్యంతో మృతిచెందారు.
సదానంద చారికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే, కొడుకు లేడనే కారణంతో ఎలాంటి వెనుకంజ వేయకుండా, “వారసుడు అంటే కొడుకే కాదు… కూతురు కూడా” అని నిరూపిస్తూ పెద్ద కూతురు తన తండ్రి పార్థివ దేహానికి తలకొరివి పెట్టి అంతిమ క్రియలు నిర్వహించింది.
ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కూతురు ధైర్యసాహసాలను గ్రామస్థులు అభినందించారు. తల్లిదండ్రుల పట్ల కూతుళ్ల ప్రేమ, బాధ్యతను చాటిచెప్పిన ఈ సంఘటన సమాజానికి మంచి సందేశాన్ని అందించింది.
“కంటే కూతుర్నే కనాలి” అనే నానుడికి సార్థకత చేకూర్చిన ఈ ఘటన పలువురి ప్రశంసలు అందుకుంటోంది.