
రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో ఈ నెల 21వ తేదీన జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం నేపథ్యంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గురువారం ఆలయాన్ని సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణతో కలిసి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ, కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని తెలంగాణలో రెండవ యాదాద్రిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 12.15 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టిందని తెలిపారు. ఇటీవల ఫిబ్రవరి 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులు, అతిథి గృహాన్ని ప్రారంభించినట్లు గుర్తుచేశారు. యాదాద్రి తరహాలో కొడవటంచను తీర్చిదిద్ది గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేని సంపత్ రావు, మాజీ వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ-వరద రాజేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.