చిత్తడి నేల దినోత్సవం సందర్భంగా పర్యావరణ సదస్సు
జన విజ్ఞాన వేదిక హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2న చిత్తడి నేల దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ సదస్సు నిర్వహించారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సెయింట్ మ్యాథ్యూస్ హై స్కూల్ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ధర్మసాగర్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో విశ్రాంత అటవీ అధికారి కాజీపేట పురుషోత్తం ప్రధాన వక్తగా హాజరయ్యారు. చిత్తడి నేలలు సహజంగానే నీటిని శుభ్రం చేస్తాయని ఆయన తెలిపారు. పట్టణాల విస్తరణ, ఆక్రమణలు, ప్లాస్టిక్ మరియు రసాయన కాలుష్యం, నీటి దుర్వినియోగం, వాతావరణ మార్పుల కారణంగా చిత్తడి నేలలు అంతరించిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.గ్రామాలు, బస్తీలలో ఉన్న చెరువులు, కుంటలను అన్యాక్రాంతం కాకుండా కాపాడుతూ పునరుద్ధరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.