జయశంకర్ జిల్లా మారుతుందన్న దుష్ప్రచారాన్ని మానుకోవాలి
జిల్లా మారితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను-ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై అసత్య ఆరోపణలు తగదు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి
జయశంకర్ భూపాలల్లి జిల్లా మారుతుందన్న దుష్ప్రచారాన్ని కొందరు నేతలు కావాలనే చేస్తున్నారని, అలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టంగా తెలిపారు.బుధవారం సాయంత్రం భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తదితర ముఖ్య నేతలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత రెండేళ్ల కాలంలో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సుమారు రూ.350 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుతుందన్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ విసిరారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు జరుగుతున్న ఈ ప్రచారం వెనుక రాజకీయ స్వార్థం తప్ప మరేదీ లేదన్నారు. అబద్ధాల పుట్టుక ఎక్కడ జరిగిందో ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొందరు రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. అభివృద్ధి పనులపై ఎవరికైనా సందేహాలు ఉంటే అధికారికంగా వివరాలు తెలుసుకోవచ్చని, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.భూపాలపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం తమ బాధ్యత అని పేర్కొన్న ఎమ్మెల్యే, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు 30 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.