జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం
టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి,పత్రిక కు అనుబంధ కాదు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు సాధించేవరకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నిరంతరం పోరాడుతుందని ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు,రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య స్పష్టం చేశారు.సోమవారం ఖమ్మంలోని కోణార్క్ హోటల్లో సంతోష్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సంఘం పనిచేస్తుందని తెలిపారు.టీడబ్ల్యూజేఎఫ్ పట్ల కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మామిడి సోమయ్య తీవ్రంగా ఖండించారు.జర్నలిస్టులను అయోమయానికి గురి చేసేందుకు,సంఘం తమదే అన్నట్లుగా కొందరు మాజీ
నాయకులు చేస్తున్న ప్రచారాలను జర్నలిస్టులు నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.ఫెడరేషన్లోని వ్యవస్థాపక సభ్యులు అన్ని జిల్లాలు తిరుగుతూ సంఘం బలోపేతానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కూడా సంఘాన్ని బలోపేతం చేయడానికి త్వరలో జిల్లా మహాసభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న
ప్పటికీ జర్నలిస్టుల ప్రధాన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి టీడబ్ల్యూజేఎఫ్ సిద్ధమవుతుందని హెచ్చరించారు.జర్నలిస్టుల పక్షాన నిలబడి సమస్యలపై నిరంతరం పోరాటం చేసే ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఐఎఫ్డబ్ల్యుజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఐఎఫ్డబ్ల్యుజే నిరంతరం పోరాడుతోందని అన్నారు.జర్నలిస్టుల కోసం ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేయాలని,సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ పథకం ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఫెడరేషన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం పూర్తిగా జర్నలిస్టుల సంక్షేమం కోసమేనని మామిడి సోమయ్య మరోసారి స్పష్టం చేశారు.ఎలాంటి రాజకీయ పార్టీ ప్రభావం లేకుండా,పూర్తిస్థాయి స్వతంత్రతతో టీడబ్ల్యూజేఎఫ్ పనిచేస్తోందని చెప్పారు.గతంలో కొందరు సంఘం పేరును దుర్వినియోగం చేసి వ్యక్తిగత ప్రయోజనాలు పొందేందుకు యత్నించారని విమర్శించారు.ఇకపై అలాంటి వాటికి తావులేకుండా క్రమశిక్షణాత్మక విధానాలతో సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంతో పాటు ఆరోగ్య బీమా,ప్రమాద బీమా,వేతన భద్రత,వృద్ధాప్య పెన్షన్,అక్రెడిటేషన్ విధానాల్లో పారదర్శకత వంటి అంశాలపై కూడా ప్రభుత్వ స్థాయిలో సమగ్ర పోరాటం చేపడతామని తెలిపారు.ఈ సమస్యలన్నింటిపై త్వరలో ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించడంతో పాటు వివిధ దశల్లో ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.ఖమ్మం జిల్లా జర్నలిస్టులు సంఘ పునర్నిర్మాణంలో చురుకుగా పాల్గొని బలమైన కమిటీ నిర్మాణానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లా కమిటీల్లో యువ జర్నలిస్టులకు సముచిత ప్రాధాన్యం ఇస్తామని,అనుభవజ్ఞులైన సీనియర్ జర్నలిస్టుల సలహాలు,మార్గదర్శకత్వంతోనే సంఘాన్ని ముందుకు నడిపిస్తామని పేర్కొన్నారు.జర్నలిస్టుల సమస్యల సాధన కోసం చిన్న పెద్ద పత్రికలతో పాటు అందరూ జర్నలిస్టులు తమతో కలిసి రావాలని మామిడి సోమయ్య పిలుపునిచ్చారు.సమావేశానికి హాజరైన జర్నలిస్టులు టీడబ్ల్యూజేఎఫ్ ఆవిర్భావ లక్ష్యాలను స్వాగతిస్తూ పూర్తి మద్దతు ప్రకటించారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం తీసుకునే ప్రతి పోరాటంలో
భాగస్వాములుగా ఉంటామని స్పష్టం చేశారు.సమావేశం చివర్లో సమిష్టి ఉద్యమంతోనే జర్నలిస్టుల హక్కులను సాధించగలమని నినాదాలు చేస్తూ సమావేశాన్ని ముగించారు.ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాకు అడ్హాక్ కమిటీని ప్రకటించారు.ఖమ్మం జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ కన్వీనర్గా టీ. సంతోష్ చక్రవర్తి,కో-కన్వీనర్లుగా అర్వపల్లి నగేష్,అంతోటి శ్రీనివాస్, నానబాల రామకృష్ణ,వందనపు సామ్రాట్లను రాష్ట్ర కమిటీ ప్రకటించింది.ఇప్పటివరకు ఉన్న టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర,జిల్లా కమిటీలన్నీ రద్దు చేసినట్లు,త్వరలో కొత్త రాష్ట్ర కమిటీతో పాటు అన్ని జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కో-కన్వీనర్లు వల్లాల జగన్,జి.వెంకటేశ్వర్లు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పి.గోపాల్,పాల్వాయి జానయ్య,రఘురాం,సాదిక్ పాషా,న్యాయ సలహాదారులు పసుపులేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.