టీఆర్పీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
అభ్యర్థుల గెలుపు కోసం గడపగడపన రవి పటేల్ ప్రచారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు.టీఆర్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ నేతృత్వంలో మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల గుండా ర్యాలీ కొనసాగింది.ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృత ప్రచారం చేపట్టి, ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటూ తమ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.ర్యాలీ సందర్భంగా రవి పటేల్ గడపగడపన ప్రచారం నిర్వహిస్తూ, టీఆర్పీ పార్టీకి కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి వెనుకబడి పోయిందని ఆయన విమర్శించారు. మౌలిక వసతులు, తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, వీధిదీపాలు వంటి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో గత పాలకులు విఫలమయ్యారని పేర్కొన్నారు.టీఆర్పీ పార్టీ అభ్యర్థులు గెలుపొందితే భూపాలపల్లిని నిజాయితీగా, పారదర్శకంగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. రూపాయి అవినీతి లేకుండా ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రతి వార్డును సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ప్రజలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతామని కూడా హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎస్పీకే సాగర్, టీఆర్పీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, వివిధ శాఖల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, యువజన విభాగ నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.