సమ్మె తాత్కాలిక విరమణ
ఇతర సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ. సమ్మె విరమించాలని మంత్రి విజ్ఞప్తి.
41 రోజులుగా జరుగుతున్న సమ్మెను తాత్కాలికంగా విరమించిన కార్మికులు
గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్లకు తగ్గించిన వేతనాలను తిరిగి చెల్లిస్తామని మరియు పిఎంహెచ్ వర్కర్ల సమస్యల పరిష్కారానికి గిరిజన సాంఘిక మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అట్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. విద్యార్థుల సౌకర్యం కోసం సమ్మెను విరమించాలని మంత్రి గారు డైలీవేజ్ వర్కర్లకు విజ్ఞప్తి చేశారు. మంత్రి గారి విజ్ఞప్తి మేరకు సమ్మెను తాత్కాలికంగా విరమించి విధులలో హాజరవుతున్నట్లు కార్మికులు ప్రకటించారు.
డైలీవేజ్, పిఎంహెచ్ వర్కర్లకు వేతనాలు తగ్గించిన జీఓ 64, 527ల అమలు నిలిపివేయాలని, డైలీవేజ్ వర్కర్లకు టైం స్కేల్ ఇవ్వాలని, పిఎంహెచ్ వర్కర్లకు జి.ఒ.60 ప్రకారం వేతనాలు చెల్లించాలని మరియు ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం 2025 సెప్టెంబర్ 12 నుండి గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవేజ్ కాంటిన్జెంట్, పిఎంహెచ్ వర్కర్లు నిరవధికంగా సమ్మె చేస్తున్నారు. మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి గారి జోక్యంతో నిన్న, రోజు రాష్ట్ర సచివాలయంలో గిరిజన సాంఘిక మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి శ్రీ అట్లూరి లక్ష్మణ్ కుమార్ కార్యాలయంలో వివిధ జిల్లాల నుండి వచ్చిన డైలీవేజ్, పిఎంహెచ్ వర్కర్ల ప్రతినిధులతో చర్చలు జరిగాయి. కార్మికుల యొక్క డిమాండ్లైన వేతనాల తగ్గింపు సమస్య, టైం స్కేల్ అమలు, జీవో 60 ప్రకారం పిఎంహెచ్ వర్కర్లకు వేతనాలు, పూర్తికాలం పనిచేస్తున్న కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లింపు, సెలవులలో కార్మికులకు వేతనాలు చెల్లింపు, చనిపోయిన వర్కర్ల కుటుంబ సభ్యులకు ఉపాధి, ప్రమాద బీమా తదితర అన్ని డిమాండ్లపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ తగ్గించిన వేతనాలను తిరిగి చెల్లిస్తామని, దీని కోసం ఇప్పటికే ఆర్థిక శాఖామంత్రి, అధికారులతో చర్చించామని తెలియజేశారు. టైంస్కేల్ సమస్యపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లింపు, టైం స్కేల్ ఇతర అన్నిరకాల సమస్యలు, ఇవన్నీ దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలని ఈ సమస్యలపై చర్చించి అతి త్వరలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని సమ్మెను విరమించాలని, సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి గారి విజ్ఞప్తిపై జేఏసీ నాయకత్వం సమ్మెను విరమించి విధులకు హాజరవుతామని ప్రకటించారు.
ఈ చర్చలలో ప్రభుత్వం తరఫున గిరిజన సంక్షేమ శాఖామంత్రి గారితో పాటు గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు, రాష్ట్ర జేఏసీ నాయకులు బి మధు, మాడె పాపారావు, కె. బ్రహ్మచారి, లక్ష్మణ్, జలంధర్, బి. నాగేశ్వరరావు, వీరులాల్, శ్రీను, నాగలక్ష్మి, సౌందర్య, నాగలక్ష్మి, శంకర్, రమేష్, సురేందర్, భరత్, రామ్, జి మోహన్, స్వామి, ముత్తమ్మ, సరళ, మోహన్, సుబ్బారావు, రవి, రాజేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సమ్మె తాత్కాలిక విరమణ – మరో రూపంలో ఆందోళన కొనసాగిస్తాం :
సమ్మెను తాత్కాలికంగానే విరమిస్తున్నామని, విధులకు హాజరవుతూ టైంస్కేల్, అలాగే జీవో నెంబర్ 60 ప్రకారం పిఎంహెచ్ వర్కర్లకు వేతనాలతో సహా ఇతర అనేక డిమాండ్లను పరిష్కరించేంత వరకు మరో రూపంలో ఆందోళన కొనసాగిస్తామని కార్మికుల జేఏసీ నాయకత్వం ప్రకటించింది.