తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేత కార్యక్రమం
మహిళా అధ్యక్షురాలిగా సాధు అనిత శ్రావణ్ నియామకం–పలు నాయకుల చేరిక జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో పార్టీ బలోపేత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ నాయకత్వం వహించారు.కార్యక్రమంలో భాగంగా రేగొండ మండల టీఆర్పీ మహిళా అధ్యక్షురాలిగా సాధు అనిత శ్రావణ్ను నియమించగా, పలు స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలను సమర్థిస్తూ రాజ్యాధికార పార్టీలో చేరారు.ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధనే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఐక్యతతో ప్రజాస్వామ్య పరిపాలనను నెలకొల్పడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో 2028లో పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యమని, బీసీ వర్గానికి చెందిన ముఖ్యమంత్రిని రాష్ట్రానికి అందించడమే తమ సంకల్పమని స్పష్టం చేశారు.భూపాలపల్లి నియోజకవర్గంలో తొలి ఎమ్మెల్యే స్థానాన్ని సాధించేందుకు క్షేత్రస్థాయిలో గడపగడపకు ప్రచారం చేపట్టాలని, అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. “మేము ఎంతో – మాకు అంత” అనే నినాదంతో ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా చాటి చెప్పాలని కోరారు.పార్టీ ప్రధాన మేనిఫెస్టోలో భాగంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైట్ టు రీకాల్ అమలు, భూమిలేని నిరుపేద కుటుంబాలకు రెండు ఎకరాల భూమి పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే లక్ష్యమని రవి పటేల్ తెలిపారు.కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగి, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని నాయకులు పేర్కొన్నారు.