
ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్, మార్చి 13:
స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ..మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం పన్నులు వసూలు అయ్యేలా అధికారులు, కౌన్సిలర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో పన్నుల వసూళ్లు ఎలా అమలు చేస్తున్నారో అధ్యయనం చేసి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.సామాన్యులు, పేద ప్రజలపై ఎక్కువ భారం పడకుండా ముందుగా వాణిజ్య, వ్యాపార పన్నులను సమర్థంగా వసూలు చేయాలని తెలిపారు.పన్నులు సక్రమంగా వసూలు అయితేనే ఉద్యోగులు, కార్మికులకు జీతాలు చెల్లించడం, పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.అనంతరం 2026–27 సంవత్సరానికి రూ.63 కోట్ల 33 లక్షల 70 వేల బడ్జెట్ అంచనాలను మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది.పట్టణంలో మార్కెట్ ఏర్పాటు, పార్క్ అభివృద్ధి వంటి అంశాలపై కూడా తీర్మానాలు ఆమోదించి ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, వైస్ చైర్మన్ నీల రాజమ్మ, కౌన్సిలర్లు, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.