బహిరంగ సభను విజయవంతం చేయాలి-సిపిఐ పిలుపు
జనవరి 18న ఖమ్మంలో జరగనున్న సిపిఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభకు వేలాదిగా తరలి వచ్చి విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకులు పిలుపునిచ్చారు.సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ‘ఛలో ఖమ్మం’బహిరంగ సభ గోడపత్రికను నాయకులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిపిఐ జనగామ జిల్లా కార్యవర్గ సభ్యులు,మండల కార్యదర్శి జువారి రమేష్ మాట్లాడుతూ..సిపిఐ పార్టీ అనేక త్యాగాలు చేసి ప్రజలకు హక్కులను సాధించి పెట్టిన చరిత్ర కలిగిన పార్టీ అని అన్నారు.నగరాల్లో పేద ప్రజల కోసం వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసి,రాజీలేని పోరాటాల ద్వారా లక్షలాది మందికి భూమిపై చట్టబద్ధమైన హక్కులు కల్పించిందని గుర్తు చేశారు.ప్రజా పోరాటాలకు కేరాఫ్ అడ్రస్గా ఎర్రజెండా తప్ప మరొకటి లేదని పేర్కొన్నారు.పాలకులకు పేద ప్రజలపై చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఆశించిన మార్పు,అభివృద్ధి జరగలేదని విమర్శించారు.శ్రమనే నమ్ముకుని జీవించే కార్మిక వర్గానికి నాయకత్వం వహిస్తూ యాజమాన్యాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించిన ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు.విద్యార్థులు,యువజనులు,మహిళలు,రైతులు,బుద్ధిజీవుల హక్కుల కోసం అనేక సంఘాలను ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి సిపిఐ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు కార్యకర్తలు,ప్రజలు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పెండ్యాల సమ్మయ్య,అన్నెపు విష్ణు,ఎండీ యాకుబ్ పాషా,మంద బుచ్చయ్య,బుల్లె దూడయ్య,ఎండీ జాఫర్,అన్నెపు అజయ్,బుల్లె లింగయ్య,నియోజకవర్గ నాయకులు మునిగల భిక్షపతి,రవి తదితరులు పాల్గొన్నారు