మార్వాడి పాన్ బ్రోకర్పై సిపిఎం ఆగ్రహం
వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్
స్టేషన్ ఘనపూర్ లో అధిక వడ్డీలు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఓం గణేష్ మార్వాడి పాన్ బ్రోకర్ యజమానిని వెంటనే అరెస్ట్ చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మునిగెల రమేష్ డిమాండ్ చేశారు.ఆదివారం రోజు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిల్పూర్ మండలానికి చెందిన రైతు గద్ద కుమార్ వ్యవసాయ పెట్టుబడుల కోసం ఘనపూర్ మండల కేంద్రంలోని ఓం గణేష్ జ్యువెలర్స్ వద్ద వెండి, బంగారం 11 నెలలపాటు కుదువ పెట్టుకున్నారని తెలిపారు. అయితే డబ్బులు చెల్లించే సమయంలో నెలలు దాటిపోయాయని సాకుతో 6 శాతం అధిక వడ్డీ చెల్లిస్తేనే ఆభరణాలు ఇస్తానని షాప్ యజమాని బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు.అంతేకాకుండా, రైతుతో వచ్చిన వారిని కూడా అసభ్యంగా తిట్టి, మర్యాద లేకుండా ప్రవర్తించినట్లు పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రస్తావించారు. ఎండనక, వాననక శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతును అవమానించే విధంగా ప్రవర్తించడం ఖండనీయమని అన్నారు.ఈ ఘటనపై సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి, రైతులను మోసం చేస్తున్న మార్వాడి పాన్ బ్రోకర్ యజమానిపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మార్వాడి షాపుల్లో అధిక వడ్డీకి డబ్బులు తీసుకున్న బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.ఇప్పటికైనా అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోతే, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలను కలుపుకుని ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు చిలుముల్ల భాస్కర్, తోడెంగల ఐలయ్య, నాయకులు వంగపడ్ల సోమయ్య తదితరులు పాల్గొన్నారు