నాగపురి కిరణ్ కుమార్ గౌడ్
తెలుగు గళం న్యూస్ జనగామ
గత పది సంవత్సరాలుగా జనగామ మున్సిపాలిటీ పరిపాలనను నిర్వీర్యం చేసి ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన బీఆర్ఎస్ పార్టీని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు.గురువారం జనగామ పట్టణం మూడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి బూడిది జ్యోతి విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో మూడో వార్డు నుంచి ఎన్నికైన కౌన్సిలర్ వార్డు సమస్యలను పట్టించుకోకపోవడంతో రోడ్లు లేకపోవడం, మురుగు కాలువలు సరిగా లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం వంటి తీవ్రమైన సమస్యలు నెలకొన్నాయని తెలిపారు.మూడో వార్డులో ఉన్న గార్లకుంటను పార్కుగా అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసిందని, జనగామ పట్టణానికి వచ్చిన రూ.18 కోట్ల అభివృద్ధి నిధుల్లో సుమారు రూ.1.70 కోట్లు మూడో వార్డుకు కేటాయించారని చెప్పారు.భవిష్యత్తులో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో రోడ్లు, మోరీలు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
వార్డు సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన బూడిది జ్యోతిని గెలిపించి ప్రశ్నించే గొంతును మున్సిపాలిటీకి పంపితేనే మూడో వార్డు అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ గ్రంథాలయ చైర్మన్ కసిరెడ్డి ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నిమ్మతి మహేందర్ రెడ్డి, కాయిదాపురం మహేందర్ రెడ్డి, నూకల బాల్ రెడ్డి, మచ్చ ప్రవీణ్, భూక్య కోటా నాయక్, దామోదర్ రెడ్డి, మచ్చ కుమార్, సీపీఎం నాయకులు సింగారపు రమేష్, ఎండి షబానా, తూటి దేవదానం తదితరులు పాల్గొన్నారు.