రేగొండ మండలంలో మిర్చి పంట దొంగతనం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో రైతు పంట దొంగతనం ఘటన వెలుగుచూసింది.మండలంలోని రావులపల్లి గ్రామానికి చెందిన రైతు చల్లా కుమారస్వామి పండించిన మిర్చి పంటను గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దొంగతనం చేశారు.రైతు తెలిపిన వివరాల ప్రకారం,జగ్గయ్యపల్లి–రేగొండ రోడ్డులో తన వ్యవసాయ చేను వద్ద కోత కోసి కుప్పగా నిల్వ ఉంచిన మిర్చి పంటను గత రాత్రి సమయంలో దుండగులు ఎత్తుకెళ్లారు.ఆరు కాలం శ్రమించి పండించిన పంటను ఒక్క రాత్రిలోనే కోల్పోయానని రైతు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.మిర్చి పంట సాగు కోసం సుమారు రూ.4 లక్షలు అప్పు తీసుకుని సాగు చేశానని,దొంగలు సుమారు రూ.3 లక్షల విలువైన మిర్చిని తీసుకెళ్లారని కన్నీటి పర్యంతమై తెలిపారు.కష్టానికి ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక ఎస్సై రాజేష్ మీడియాకు తెలిపారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నామని,బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.