సర్ ప్రక్రియను సీరియస్గా తీసుకోవాలి
ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ ఏజెంట్లకు దిశానిర్దేశం
•ప్రతి అర్హత కలిగిన వ్యక్తి ఓటు హక్కు పరిరక్షించుకోవాలి తెలంగాణలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియను పార్టీ శ్రేణులు సీరియస్గా తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఆదివారం మడికొండలోని శ్రీ సత్యసాయి కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన సర్ ప్రక్రియపై బూత్ స్థాయి ఏజెంట్ల ప్రత్యేక శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు.ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు పునాది వంటిదని, ప్రతి అర్హత కలిగిన వ్యక్తి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకుని ఆ హక్కును పరిరక్షించుకోవాలని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రక్షాళన కోసం లెక్కింపు ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలు సేకరించాలన్నారు.గ్రామాల్లోని బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియ విజయవంతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు లెక్కింపు పత్రాలు అందజేయడంతో పాటు వాటిని సరిగా నింపడంలో సహకరించాలని,కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణలు, చిరునామా మార్పులు చేయించాలని కోరారు.ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, చదువు రాని వారు ఫారం నింపలేని వారికి ప్రత్యేక సహాయం అందించి ఎవరూ ఈ ప్రక్రియకు దూరం కాకుండా చూడాలని సూచించారు.బూత్ స్థాయి ఏజెంట్లు బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ ఓటరు జాబితాలో లోపాలు గుర్తించి సరిదిద్దేందుకు కృషి చేయాలని తెలిపారు. చనిపోయిన వారి పేర్లు, ఒకే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఉన్న డబుల్ ఓట్లు గుర్తించి నిబంధనల ప్రకారం తొలగించేలా చొరవ చూపాలన్నారు.ఓటర్ల జాబితా పారదర్శకంగా చేపట్టడంలో బీఎల్ఏల పాత్ర కీలకమని అన్నారు. అనంతరం ఓటర్ల జాబితా ప్రత్యేక యాప్ను ఆవిష్కరించి దాని పని తీరును నాయకులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, రాష్ట్ర హజ్ కమిటీ అధ్యక్షుడు ఖుస్రు పాషా,వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆయుబ్, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి, టెస్కాబ్ అధ్యక్షుడు మార్నేని రవీందర్ రావు, పార్లమెంట్ సర్ బాధ్యుడు దుద్దిళ్ల శ్రీనివాస్,హన్మకొండ జిల్లా యువజన అధ్యక్షుడు దిలీప్ రాజ్, నియోజకవర్గ, జిల్లా,మండల, డివిజన్,గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.