సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయం
బాలికల కోసం దేశంలోనే తొలి పాఠశాలను స్థాపించి మహిళా విద్యకు దిశానిర్దేశం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే సేవలు చిరస్మరణీయమని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ అన్నారు.సావిత్రిబాయి పూలే 195వ జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, శనివారం జిల్లా ఐడిఓసి కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగాలని సూచించారు. అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన చేస్తూ సమాజానికి ఉత్తమ పౌరులను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని విద్యార్థుల్లో ప్రేరణ, సమానత్వ భావనలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. విద్యార్థులను ఆత్మవిశ్వాసంతో ప్రతి సమస్యను ఎదుర్కొనేలా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.అనంతరం జిల్లాలోని 18 మంది ఉత్తమ ఉపాధ్యాయులను విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఇటీవల గ్రూప్–1 అధికారిణిగా ఎంపికైన ఎస్సీ వెల్ఫేర్ శాఖ అధికారిణి సుకీర్తిని ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్, సంక్షేమ అధికారి మల్లేశ్వరి, సీఎమ్ఓ సామల రమేష్, ఎఎంఓ పింగిలి విజయపాల్ రెడ్డి, ఏఎస్ఓ రామకృష్ణ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అవార్డు గ్రహీతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.