డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్పై ఏసీబీ దాడులు
రూ.250 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు
రవాణా శాఖ తిమింగలం కిషన్ నాయక్ ఏసీబీ వలలో మహబూబ్నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తూ, హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో నివాసం ఉంటున్న ఎం.కిషన్ నాయక్పై ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు.అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఇళ్లు,బంధుమిత్రుల నివాసాలు కలిపి మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.నిజామాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని బోయినపల్లి నివాసంలో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు భారీ స్థాయిలో అక్రమ ఆస్తులను గుర్తించారు.నారాయణఖేడ్ ప్రాంతంలో 31 ఎకరాలు,నిజామాబాద్ ప్రాంతంలో 10 ఎకరాల భూమి,నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లహరి ఇంటర్నేషనల్ హోటల్లో 50 శాతం వాటా,రాయల్ ఓక్ ఫర్నిచర్ షాపుకు లీజుకు ఇచ్చిన 3,000 గజాల వాణిజ్య స్థలం ఉన్నట్లు వెల్లడించారు.అదేవిధంగా,కిలో బంగారు ఆభరణాలు,బ్యాంకు ఖాతాలో రూ.1.37 కోట్ల నగదు,అశోక్ టౌన్షిప్లో రెండు ఫ్లాట్లు, 4,000 గజాల స్థలంలో నిర్మించిన పాలీహౌస్ను కూడా గుర్తించినట్లు ఏసీబీ డీజీ చారుసింహా తెలిపారు.సోదాల సందర్భంగా కిషన్ నాయక్ బంధువుల ఇళ్లలో లభ్యమైన ఆస్తి పత్రాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.ప్రాథమిక అంచనాల ప్రకారం కిషన్ నాయక్కు సంబంధించిన మొత్తం ఆస్తుల విలువ రూ.250 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతోందని తెలిపారు