కాంగ్రెస్ అభ్యర్థులకు సిపిఎం సంపూర్ణ మద్దతు
స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ కీలక ప్రకటన చేశారు. రాబోయే ఘన్పూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వెల్లడించారు.నూతనంగా ఏర్పాటైన ఘన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి అత్యవసరమని, పట్టణంలో డ్రైనేజీ, రోడ్లు, కార్యాలయ సౌకర్యాలు వంటి పలు సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే పట్టణ యువతకు ఉపాధి కల్పన కోసం పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధిపై విజన్తో పని చేస్తున్నారని భావించి, పట్టణ అభివృద్ధి దృష్ట్యా కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నామని తెలిపారు.ప్రజలు, పార్టీ శ్రేణులు కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ తప్పక అమలు చేయాలని సూచించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జులుకుంట్ల శిరీష్ రెడ్డి మాట్లాడుతూ సిపిఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిని గుర్తించి మద్దతు ప్రకటించడం సానుకూల పరిణామమని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని అన్నారు.ఈ సమావేశంలో సిపిఎం, కాంగ్రెస్ మండల నాయకులు కత్తుల రాజు, చిలుముల్ల భాస్కర్, బేతి జైపాల్ రెడ్డి, నాగరబోయిన శ్రీరాములు, మంద మహేందర్, సిద్దుల సుదర్శన్, భూశెట్టి రాంబాబు, మునిగే నరసింహులు, లింగనబోయిన రాజు, రాపోలు సాయి చరణ్ రెడ్డి, జిల్లపల్లి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.