కాళేశ్వరానికి ప్రత్యేక బస్సుల ఏర్పాటు
భక్తుల సౌకర్యార్థం అదనపు సర్వీసులు – భూపాలపల్లి డిపో మేనేజర్ ఏ.ఇందు మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని ప్రఖ్యాత శ్రీ కాళేశ్వర దేవస్థానంలో ఈ నెల 14, 15, 16 తేదీలలో ఘనంగా నిర్వహించనున్న మహా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు భూపాలపల్లి డిపో మేనేజర్ శ్రీమతి ఏ.ఇందు తెలిపారు.మహా శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు కాళేశ్వరాన్ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హనుమకొండ, భూపాలపల్లి నుండి కాళేశ్వరానికి ఇప్పటికే నడుస్తున్న సాధారణ సర్వీసులతో పాటు అదనపు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రస్తుతం హనుమకొండ – కాళేశ్వరం, భూపాలపల్లి – కాళేశ్వరం మార్గాల్లో కలిపి రోజుకు సుమారు 40 ట్రిప్పులు నడుస్తున్నాయని వెల్లడించారు. ఉత్సవాల సందర్భంగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశముండటంతో భూపాలపల్లి డిపో నుంచి అదనంగా 5 ప్రత్యేక బస్సులను కేటాయించి మొత్తం 20 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు పేర్కొన్నారు.భక్తుల రద్దీ మరింత పెరిగిన పక్షంలో అవసరాన్ని బట్టి మరిన్ని బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. బస్సులు సమయపాలనతో నడపాలని సిబ్బందికి సూచనలు జారీ చేసినట్లు కూడా చెప్పారు.మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ప్రైవేట్ వాహనాల కంటే ప్రభుత్వ రవాణా సౌకర్యాలను వినియోగించుకోవడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గించడంలో సహకరించాలని డిపో మేనేజర్ కోరారు.మరిన్ని వివరాల కోసం భూపాలపల్లి బస్ స్టేషన్ ఎంక్వైరీ నంబర్ 7382854256 ను సంప్రదించాలని సూచించారు.ప్రజలందరూ ఈ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని మహా శివరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు