రెండు నెలల పాటు చేపల వేట నిషేధం
ఘనపురం మండలం గణప సముద్రం రిజర్వాయర్ పరిధిలో 2026 సంవత్సరం జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు వరదల నేపథ్యంలో చేపల పట్టడంపై ప్రత్యేక నియంత్రణలు, నిషేధం అమల్లో ఉంటాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మత్స్యశాఖ అధికారి వై.విజయ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని ప్రధాన జలాశయాల పరిధిలో వరదల కారణంగా చేపల వనరుల సంరక్షణ, చేప పిల్లల సహజసిద్ధమైన ఎదుగుదల,మత్స్య సంపద పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ మేరకు జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు రెండు నెలల పాటు గోదావరి జలాశయ పరివాహక ప్రాంతాల్లో చేపల వేటతో పాటు చేప పిల్లల సేకరణ,రవాణా,విక్రయాలపై పూర్తిగా నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు.ప్రభుత్వం విధించిన ఈ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా చేపల వేటకు పాల్పడితే తెలంగాణ ఇన్ల్యాండ్ ఫిషరీస్ చట్టం–1976, సంబంధిత ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.సంబంధిత మత్స్యశాఖ అధికారులు, మత్స్యకార సహకార సంఘాల ప్రతినిధులు, స్థానిక గ్రామస్థులు ఈ ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా అమలు చేసి, జలాశయంలో చేపల వనరుల సంరక్షణకు పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా మత్స్యశాఖ అధికారి విజ్ఞప్తి చేశారు.ప్రస్తుత వర్షాకాలం,వరదల సమయంలో తీసుకునే ఈ ముందస్తు నియంత్రణ చర్యల వల్ల రాబోయే రోజుల్లో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని,తద్వారా మత్స్యకారులకు దీర్ఘకాలంలో అధిక ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని విజయ్ కుమార్ వివరించారు.